నందమూరి బాలకృష్ణ వరస ప్లాపుల నుండి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. గతేడాది వరసగా మూడు చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి భారీ ప్లాపులుగా మారిన నేపథ్యంలో ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీళ్ళిద్దరిదీ హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సింహా, లెజండ్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. సో ఆటోమేటిగ్గా అంచనాలు తారాస్థాయిలో ఉండడం ఖాయం. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి. మొదట మే లో విడుదల చేయాలనుకున్నా ప్రస్తుత పరిస్థితిని బట్టి దసరాకు వచ్చేలా చూద్దాం అని మూవీ యూనిట్ భావిస్తోంది.
ఇక బాలకృష్ణ తన తర్వాతి చిత్రాన్ని సీనియర్ దర్శకుడు బి గోపాల్ చేతిలో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. పాపులర్ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ ప్రాజెక్ట్ కు స్క్రిప్ట్ అందించే బాధ్యతను తీసుకున్నాడు. తండ్రీ కూతుళ్ళ మధ్య సంఘర్షణ ప్రధాన పాయింట్ గా ఈ సినిమా తెరకెక్కనుందని అర్ధమవుతోంది. స్క్రిప్ట్ పూర్తైన నేపథ్యంలో లాక్ డౌన్ తొలగించిన వెంటనే ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఈ ప్రాజెక్ట్ కాకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉండనుందని సమాచారం.