Advertisement

మహేష్ హ్యాండిచ్చాడు.. వంశీ టీం రంగంలోకి దిగింది

Posted : February 29, 2020 at 12:56 pm IST by ManaTeluguMovies

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ‘మహర్షి’ లాంటి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి. టాక్ మిక్స్డ్‌గా వచ్చినప్పటికీ.. ఆ సినిమా ఎలాగోలా బాక్సాఫీస్ పరీక్షను అధిగమించింది. ఈ ఉత్సాహంలో మహేష్, వంశీ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ స్క్రిప్టు మీద చాలా రోజులే పని చేసినప్పటికీ.. నరేషన్లో మహేష్‌ను మెప్పించలేకపోయాడు వంశీ. ఈ సినిమా ప్రస్తుతానికి క్యాన్సిల్ అయినట్లే కనిపిస్తోంది.

ఐతే ఇప్పుడు మహేష్ వేరే సినిమా చేసుకుంటే.. ఆలోపు స్క్రిప్టుకు మెరుగులు దిద్దో.. లేదంటే మరో కథ మీద వర్క్ చేసో మళ్లీ సూపర్ స్టార్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తాడేమో వంశీ అని చూస్తున్నారు జనాలు. కానీ అతడికి అలాంటి ఉద్దేశాలేమీ లేనట్లే కనిపిస్తోంది. వెంటనే వేరే హీరోల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కానీ స్టార్ హీరోల మీదే దృష్టిపెట్టే వంశీకి.. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్లలో ఎవరూ దొరికే పరిస్థితి కనిపించడం లేదు.

మహేష్ హ్యాండిచ్చి.. మరే హీరో కూడా దొరకలేదంటే వంశీ కెరీర్‌కే ఇబ్బందిగా మారడం ఖాయం. వంశీ వెంటనే సినిమా దక్కించులేకపోతే అతడి మీద ఎవరికీ నమ్మకం కుదరకే సినిమా ఓకే కాలేదన్న అభిప్రాయం వచ్చేస్తుంది. అందుకే ఈ ఫీలింగ్ రానివ్వకుండా వంశీ పీఆర్ టీం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వంశీ ఫలానా హీరోకు కథ చెబుతున్నాడని.. ఫలానా హీరో వంశీతో పని చేయడానికి ముందుకొస్తున్నాడని ప్రచారాలు మొదులపెట్టారు. రెండు మూడు రోజులుగా ఈ రకమైన వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఒక అడుగు ముందుకేసి తాజాగా వంశీ తొలి చిత్ర కథానాయకుడు ప్రభాస్ అతడికి ఓకే చెప్పాడని ప్రచారం చేస్తుండటం విశేషం. ‘మున్నా’ చేసే టైంలో ప్రభాస్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. పైగా ఆ సినిమా ఫ్లాప్. ఇప్పుడు ప్రభాస్ స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమమంలో ఆల్రెడీ లైన్లో ఉన్న దర్శకుల్ని పక్కన పెట్టి మహేష్‌తో నో చెప్పించుకున్న వంశీకి ఇంత తక్కువ గ్యాప్‌లో ప్రభాస్ ఓకే చెప్పి ఉంటాడని ఎలా అనుకుంటాం? ఇదంతా పీఆర్ మాయ కాక మరేంటి?


Advertisement

Recent Random Post:
Advertisement