ఎవరి లెక్క నిజం.? అన్న విషయమై జనాల్లో తీవ్రమైన కన్ఫ్యూజన్ నెలకొంది. ఒక్కటి మాత్రం నిజం.. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకి ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబు, అక్కడ గొప్ప మెజార్టీ ఏం సాధించేయలేదు. వైసీపీ బలంగా పుంజుకుందక్కడ. కాదు కాదు, అక్కడ పూర్తస్థాయిలో ఫోకస్ పెట్టింది. చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలన్న కసితో కుప్పం పరిధిలో పార్టీని బలోపేతం చేస్తూ వచ్చింది వైసీపీ అధిష్టానం. సొంత నియోజకవర్గానికి ఏమీ చెయ్యలేకపోయిన చంద్రబాబు.. అనే విమర్శ వుండనే వుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబుకి ఎదురుగాలి వీస్తోందన్నది నిర్వివాదాంశం. అయితే, వైసీపీ చెబుతున్నంత స్థాయిలో అక్కడ చంద్రబాబుకి వ్యతిరేకత వుందా.? లేదా.? అన్నదాన్ని పంచాయితీ ఎన్నికల లెక్కల్ని బట్టి చెప్పేయలేం. కానీ, వైసీపీ… కుప్పంలో బలపడిన విషయాన్ని టీడీపీ ఒప్పుకుని తీరాల్సిందే.
లేకపోతే, చంద్రబాబుకి 2019 ఎన్నికల్లో కుప్పం నుంచి దారుణమైన ఓటమి తప్పకపోవచ్చు. ఇదిలా వుంటే, రాష్ట్రవ్యాప్తంగా నిన్న జరిగిన మూడో విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. పార్టీల గుర్తులతో ఎన్నికలు జరగకపోయినా.. పార్టీల హంగామా ఫలితాల విషయంలో ఎక్కువే కనిపిస్తోంది. అధికార పార్టీకి అడ్వాంటేజ్ మామూలే. తెలుగుదేశం పార్టీ సొంత లెక్కలూ గట్టిగానే వున్నాయి. అటు టీడీపీకి, ఇటు వైసీపీకి షాకిచ్చే విషయమేంటంటే, జనసేన అనూహ్యంగా పుంజుకోవడం.