ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ముకేశ్ కల తీరింది.. రిలయన్స్ అప్పు తీరింది

అప్పులేనోడు ఈ ప్రపంచంలో చాలా తక్కువ. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా.. ఎంతోడికైనా అంతో ఇంతో రుణం ఉండటం మామూలే. మనుషులకే కాదు.. దేవుళ్లకు సైతం అప్పు బాధ తప్పదు. ఎక్కడిదాకానో ఎందుకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి సైతం రుణం తిప్పలు తప్పలేదు. కుబేరుడి దగ్గర తీసుకున్న రుణం ఇంకా తీరలేదంటారు.

అలాంటిది డిజిటల్ యుగంలో ఒక కంపెనీ ముందున్న భారీ అప్పును చెప్పిన సమయానికి ముందే తీర్చేయటం సాధ్యమేనా? అది కూడా ప్రపంచం మొత్తం విపత్తుతో వణికిపోతున్న వేళ.. అంటే అసాధ్యమనే చెప్పాలి. కానీ.. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేయటం రిలయన్స్ అధినేత ముకేశ్ కు మాత్రమే సాధ్యమేమో?

2021 మార్చి నాటికి రిలయన్స్ ను అప్పులు లేని కంపెనీగా మారుస్తానని ఈ మధ్యనే అంబానీ తన వాటాదారులకు మాట ఇచ్చారు. తానిచ్చిన హామీని దాదాపు తొమ్మిది నెలలకు ముందే తీర్చేయటం ద్వారా కార్పొరేట్ సంచలనంగా మారారు. తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. రిలయన్స్ ఇప్పుడు బంగారు దశాబ్దంలో ఉందని ప్రకటించారు.

ఇది గర్వించదగ్గ సందర్భమని.. వాటాదారుల అంచనాలను మళ్లీ మళ్లీ అధిగమించటం రిలయన్స్ డీఎన్ఏలోనే ఉందన్నారు. తన తండ్రి ఆశయాల సాధన.. దేశ శ్రేయస్సు.. సమగ్ర అభివృద్ధిలో మరింత ప్రతిష్ఠాత్మక లక్ష్యాల్ని నిర్దేశించటమే కాదు.. వాటిని సాధిస్తామన్నారు. ఇంతకీ తనకున్న భారీ అప్పును ముకేశ్ ఎలా తీర్చారన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

రుణాన్ని తీర్చటమన్న విషయాన్ని వూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాలి. ఏప్రిల్ 22 నుంచి తొమ్మిది వారాల్లో జియో ఫ్లాట్ ఫామ్స్ లో 24.7 శాతం వాటాల్ని వివిధ సంస్థలకు విక్రయించటం ద్వారా రూ.1.156 లక్షల కోట్లను సేకరించింది. మరోవైపు రైట్స్ ఇష్యూ 1.59 సార్లు ఎక్కువగా సబ్ స్కైబ్ కావటంతో మరో రూ.53,124 కోట్లను సాధించింది.

దీంతో ఈ మార్చి 31 నాటికి కంపెనీకి ఉన్న 1.61 లక్షల కోట్ల రూపాయిల రుణం ఉంది. ముకేశ్ విడుదల చేసిన ప్రకటనతో రిలయన్స్ షేరు భారీగా పెరగటమే కాదు.. రికార్డుస్థాయి గరిష్ఠానికి చేరుకుంది. రూ.1684కు చేరుకుంది. ముకేశా.. మజాకానా.

Exit mobile version