ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నాగబాబు సెటైర్: ‘పక్కింటోడి’ పళ్ళు రాలాయా.? లేదా.?

జనసేన నేత, సినీ నటుడు నాగబాబు సోషల్‌ మీడియా వేదికగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డిపై తనదైన స్టయిల్లో సెటైర్‌ వేశారు. ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి తన పాండిత్యాన్ని ప్రదర్శించే క్రమంలో ‘పాకిస్తాన్‌, చైనాతో యుద్ధం చేసినప్పుడు..’ అంటూ నోరు జారిన విషయం విదితమే.

రాజకీయ నాయకులకే కాదు, సాధారణ వ్యక్తులకీ, ఆ మాటకొస్తే ‘పండితులు’ అనదగ్గవారికీ ఒక్కోసారి మాట తడబడటం వింతేమీ కాదు. కానీ, అలా ఎవరన్నా మాట తడబడితే, దాన్ని పట్టుకుని నానా యాగీ చేయడం వైసీపీకి అలవాటైపోయింది. అందునా, ఇలాంటి విషయాల్లో విజయసాయిరెడ్డి ప్రదర్శించే ‘పైత్యం’ అంతా ఇంతా కాదు.

అన్నట్టు, నాగబాబు – విజయసాయిరెడ్డి మధ్య సోషల్‌ మీడియాలో వార్‌ ఈ మధ్య గట్టిగానే జరుగుతోందండోయ్‌. నాగబాబుని కెలకడం, ఆ తర్వాత తిట్టించుకోవడం విజయసాయిరెడ్డికి అలవాటే. అసలు విషయానికొస్తే, చైనా – పాకిస్తాన్‌ యుద్ధం (?) పై విజయసాయిరెడ్డి అతి తెలివి పైత్యానికి నాగబాబు తనదైన స్టయిల్లో సెటైరికల్‌ ‘మందు’ వేశారు.

‘పాకిస్తాన్ చైనా తో యుద్ధం చేసినప్పుడు అప్పట్లో ప్రతిపక్షం కూడా నెహ్రు గారికి సపోర్ట్ చేసిన సందర్భం.నిన్ను కడుపులో గుద్దుతే పక్కింటోడి పళ్ళు రాలిన సందర్భం…ఏంటో నాకు అర్థం కాలేదు… ’ అంటూ నాగబాబు వేసిన సెటైర్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

జనసేనతో వైసీపీ పొత్తు కోసం విజయసాయిరెడ్డి వెంపర్లాడిన వైనం గురించి నాగబాబు ఇటీవలే సోషల్‌ మీడియాలో ప్రస్తావించిన విషయం విదితమే. ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోని విజయసాయిరెడ్డికి, ఇప్పుడిలా నాగబాబు ఇంకో సెటైర్‌తో దిమ్మ తిరిగే పంచ్‌ ఇవ్వడం విశేషమే మరి.

Exit mobile version