ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

తెలుగు సినిమాపై చెరగని సంతకం.. ‘రంగస్థలం’కు 3 ఏళ్లు

ఎనభై ఏళ్లు దాటి తొంభైల్లో అడుగుపెడుతున్న తెలుగు సినీ చరిత్రలో హిట్లకు. ఇండస్ట్రీ హిట్లకు కొదవ లేదు. అలాగే అద్భుతమైన కథలకు, నటీనటుల పెర్ఫార్మెన్స్ కు సాక్ష్యంగా నిలిచిన సినిమాలూ ఎన్నో ఉన్నాయి. దేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూసిన సినిమాలూ ఉన్నాయి. ఎందరో రచయితలు, దర్శకులు అలాంటి కథలు రాశారు.. నటులు ప్రాణం పోశారు. ఈ క్యాటగిరీలోకి నేటి జనరేషన్లో వచ్చే సినిమా ఏదైనా ఉందంటే.. ఖచ్చితంగా చెప్పుకునే సినిమా ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమాకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాను దర్శక, రచయిత సుకుమార్ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది.

తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడేంత హిట్. అంతకుమించి నటనలో రామ్ చరణ్ చూపిన పరిణితి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. బదిరుడి పాత్రలో, గ్రామీణ వాతావరణంలో దాదాపు మూడు దశాబ్దాల వెనుకటి కథలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. ప్రతి సన్నివేశంలో తాను చెవిటి వాడిగా చూపిన హావభావాలు, అన్న చనిపోయినప్పుడు చేసిన నటన, క్లైమాక్స్ లో ప్రకాశ్ రాజ్ దగ్గర నటన.. నభూతో నభవిష్యతి అని చెప్పాలి. ఇలాంటి ఘన విజయాలు టాలీవుడ్ లో ఉన్నా కానీ.. అరుదైన పాత్రల్లో ఒకటిగా మాత్రం ‘చిట్టిబాబు’ పాత్ర నిలిచిపోయింది. సుకుమార్ ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం, రామ్ చరణ్ నట విశ్వరూపం.. ఈ సినిమాను నాన్ బాహుబలి కేటగిరీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిపింది.

ఏకంగా 236 కోట్ల కలెక్షన్లతో తొలి 200 కోట్ల మార్కును టాలీవుడ్ కి.. అదీ ఒక్క తెలుగు భాషలోనే అందించడం మరింత విశేషం. ఇన్ని అద్భుతాలు చేసిన రంగస్థలం విడుదలై నేటికి మూడేళ్లు. 2018 మార్చి 30న విడుదలైంది. 100 రోజుల సినిమా అనే మాటే మర్చిపోయిన నేటి రోజుల్లో.. ఓటీటీల్లో వచ్చినా కూడా 100 రోజులు 18 సెంటర్లలో రన్ కావడం టాలీవుడ్ చరిత్రలో లిఖించదగ్గదే. రామ్ చరణ్ పరంగా చూస్తే కలెక్షన్లు, రికార్డులే కాదు.. నటనలో కూడా చిరంజీవి కొడుకు చిరంజీవే అయ్యాడని మెగాభిమానులు మురిసిపోయారు. ‘రంగస్థలం’.. తెలుగు సినిమాపై చెరగని సంతకం..!

Exit mobile version