ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పాలిటిక్స్లోకి సోనూ సూద్.. సంచలన ప్రకటన

సోనూసూద్.. దేశం మొత్తానికి ఈ పేరు సుపరిచితమే. మన తెలుగు రాష్ట్రాలలో మరింత తెలుసున్న పేరే. అరుంధతి సినిమాలో వదల బొమ్మాళీ.. డైలాగుతో పిన్నా పెద్దలను ఆకర్షించిన ఉత్తరాది నటుడు.. త్వరలోనే పాలిటిక్స్లోకి వస్తానని చెప్పారు. ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో ఆయన సోదరి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో గట్టిపోటీ నెలకొన్నా.. కాంగ్రెస్కే విజయావకాశాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ తరఫున మోగా నుంచి పోటీచేస్తున్న తన సోదరి మాళవికా సూద్కు మద్దతుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

కాంగ్రెస్కు ఓటేయాలని నేరుగా ప్రచారం చేయకపోయినా.. తన సోదరిని గెలిపించాలని కోరుతూ ముందుకు సాగుతున్నారు. తనను రాజకీయాల్లోకి రావాల్సిందిగా తమ పార్టీలో చేరాల్సిందిగా కొన్ని పార్టీల నేతలు కోరారని సోనూ సూద్ వెల్లడించారు. రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని రెండుసార్లు ఆఫర్లు కూడా వచ్చాయని తెలిపారు. అయితే.. అందుకు నిరాకరించానని చెప్పిన సోను.. ఏ పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందనే విషయం బహిర్గతం చేయలేదు.

“నేను రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా. కానీ ఇప్పుడే కాదు. ఓ ఐదేళ్లపాటు సమాజ సేవపై మరింత దృష్టిపెడతా. ఆ తర్వాత రాజకీయాల సంగతి చూస్తా. నా ఆలోచనా శైలితో సారూప్యతలు ఉన్న పార్టీతో కలుస్తా. ఈ పదవికి నువ్వే అర్హుడివి వచ్చి అభ్యర్థిగా నిలబడు అని అందరూ అనే స్థాయికి ఎదిగాక వస్తా” అని సోనూసూద్ చెప్పారు.

ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు.. మాళవికకు ఒక్కసారిగా మోగా టికెట్ కేటాయించారన్న విమర్శలను సోను తోసిపుచ్చారు. ఆమెను హెలికాప్టర్ క్యాండిడేట్ పారాషూట్ క్యాండిడేట్ అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. తమ తల్లిదండ్రులు తాను మాళవిక మోగాలో ఎప్పటినుంచో సేవా కార్యక్రమాలు సాగిస్తున్నామని… ప్రజాసేవ చేసే గుణం తమ రక్తంలోనే ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా.. సేవా యజ్ఞం మాత్రం ఆగబోదని తేల్చిచెప్పారు.

Exit mobile version