ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సుకుమార్, చరణ్ కలిసి ‘పుష్ప’ వెబ్ సిరీస్

సుకుమార్ కు క్రియేటివ్ దర్శకుడన్న పేరు ఉంది. ప్రతీ సినిమాకూ చాలా సమయం తీసుకునే సుకుమార్ తన ప్రతీ స్క్రిప్ట్ కూ బోలెడంత పరిశోధన చేస్తుంటాడు. స్క్రీన్ ప్లే ను అద్భుతంగా మలచగలిగే నేర్పు ఉన్న సుకుమార్, ప్రతీ విషయంలోనూ ఒరిజినాలిటీకే ఓటు వేస్తాడు. అందుకే సుకుమార్ సినిమాలు ప్లాప్స్ అయ్యాయి కానీ బ్యాడ్ మూవీస్ మాత్రం లేవు. రంగస్థలం వంటి భారీ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప తీయనున్న సంగతి తెల్సిందే. దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తైపోయాయి. ఇక షూటింగ్ కు వెళ్లడమే తరువాయి అనుకుంటుండగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడం వల్ల బ్రేకులు పడిన విషయం తెల్సిందే.

తాజాగా సుకుమార్ గురించి ఆసక్తికర కథనమొకటి బయటపడింది. ఈ సినిమా ప్రధానంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందన్న విషయం తెల్సిందే. ఈ సినిమా స్క్రిప్ట్ ను తయారుచేసే పనిలో భాగంగా సుకుమార్ అండ్ తన టీమ్ ఎర్ర చందనం గురించి చాలానే పరిశోధన చేసినట్లు, వారి వద్ద బోలెడంత మెటీరియల్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంట్లోంచి కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే సినిమా కోసం తీసుకున్నారని, ఇంకా ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు ఎన్నో స్క్రిప్ట్ లో భాగంగా రాసుకున్నారని తెలుస్తోంది. సెన్సార్ పరిమితుల కారణంగా వాటిని తెరపై చూపించలేరు కాబట్టి సుకుమార్ ఇప్పుడు దాన్ని వెబ్ సిరీస్ గా మలచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ తో బడ్జెట్ తదితర విషయాల మీద చర్చలు సాగుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ బంధువొకరు ప్రైమ్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారని, చరణ్ మరియు ఆయన ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. సుకుమార్ కథను ఇచ్చి, తన అసిస్టెంట్ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సుకుమార్, చరణ్ నిర్మాణ పార్ట్నర్స్ గా కొనసాగే అవకాశాలున్నాయి. ఏదేమైనా లాక్ డౌన్ తొలగిపోతే కానీ ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Exit mobile version