Advertisement

సుశాంత్ కేసును విజ‌య‌వంతంగా..

Posted : September 13, 2020 at 8:58 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మూడు నెలల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఎంతగా కలచివేసిందో తెలిసిందే. ‘కై పో చే’,‘ఎం.ఎస్.ధోని’, ‘చిచ్చోరే’ లాంటి మంచి సినిమాల్లో నటించి, నటుడిగా గొప్ప పేరు సంపాదించిన సుశాంత్.. ఇలా అర్ధంతరంగా తనువు చాలిస్తాడని ఎవరూ అనుకోలేదు. అతడిది ఆత్మహత్యగానే భావిస్తున్నప్పటికీ.. దానికి దారి తీసిన పరిస్థితులపై రకరకాల ఆరోపణలు వచ్చాయి.

బాలీవుడ్లో ఓ వర్గం సుశాంత్‌ను టార్గెట్ చేసి అతడి అవకాశాలను దెబ్బ తీసిందని.. సుశాంత్ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి అతడి ప్రేయసి రియా చక్రవర్తి కూడా కారణమని.. ఇలా రకరకాల ఆరోపణలు తెరపైకి వచ్చాయి. సుశాంత్ చనిపోయాక నెలలు గడిచినా అతడి అభిమానుల్లో ఆగ్రహం తగ్గలేదు. సీబీఐ విచారణ కోసం సోషల్ మీడియాలో ఉద్యమం చేశారు. చివరికి వాళ్లు కోరుకున్నది జరిగింది.

ఐతే కొన్ని రోజుల ముందు వరకు సుశాంత్ కేసు మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంటూ వచ్చింది. అతడికి న్యాయం జరగాలని అందరూ డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ కేసు మీడియాతో పాటు జనాల దృష్టి నుంచి పక్కకు వెళ్లిపోయింది. అందుక్కారణం కంగనా రనౌత్, రియా చక్రవర్తిలే.

సుశాంత్‌కు మద్దతుగా మాట్లాడినట్లే మాట్లాడి.. తన పర్సనల్ అజెండాను తెరపైకి తెచ్చి కొందరిని సెలెక్టివ్‌గా టార్గెట్ చేసింది కంగనా. ఈ విషయంలో మొదట కంగనా ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నప్పటికీ ఒక దశ దాటాక ఆమె తీరు అందరిలోనూ సందేహాలు రేకెత్తించించింది. అనుకున్నట్లే కంగనా అజెండానే వేరని ఇప్పుడు స్పష్టమైపోయింది. సుశాంత్ ఇష్యూతో మొదలుపెట్టి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టు కట్టి మహారాష్ట్రలోని శివసేన సర్కారును ఢీకొట్టడం మొదలుపెట్టింది కంగనా. దీన్ని బట్టి చూస్తే సుశాంత్ ఇష్యూను కంగనా తనకు అనుకూలంగా వాడుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఇక రియా విషయానికి వస్తే ఆమె ముందు ఆరోపణలు ఎదుర్కొంది సుశాంత్ ఆత్మహత్య కేసులో. కానీ ఇప్పుడు అరెస్టయింది డ్రగ్స్ వాడిన కేసులో. తాను డ్రగ్స్ వాడటంతో పాటు సుశాంత్‌తో పాటు కొందరికి రియా డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా విచారణలో రకుల్ ప్రీత్ సహా పలువురి పేర్లు వెల్లడించడం, మరిన్ని పేర్లను ఆమె బయటపెడుతుందని వార్తలొస్తుండటం సంచలనం రేపుతోంది. ఇక్కడ కూడా సుశాంత్ ఇష్యూ మొత్తం పక్కకు వెళ్లిపోయి డ్రగ్స్ కేసు మీదికి అందరి దృష్టీ మళ్లింది. ఈ రకంగా సుశాంత్ కేసు అన్ని రకాలుగా డైవర్ట్ అయిపోయిందని స్పష్టమవుతోంది.

ఇంతకుముందు సుశాంత్ అభిమానుల ఆగ్రహానికి భయపడి, వారిని మెప్పించేందుకైనా అతడి మృతి కేసులో విచారణ వేగంగా సాగుతుందని, నిజాలు బయటికి వస్తాయని ఆశ ఉండేది. కానీ ఇప్పుడు కంగనా, రియా, మిగతా వాళ్లు కలిసి విజయవంతంగా ఆ కేసును పక్కదోవ పట్టించేశారు. ఇక ఆ కేసులో విచారణ ఏమాత్రం సజావుగా సాగుతుందో, ఏ మేర నిజాలు బయటికి వస్తాయో అన్నది సందేహమే.


Advertisement

Recent Random Post:

YSRCP Bus Yatra | జగన్ వస్తే జన జాతరే ..!! CM Jagan

Posted : April 18, 2024 at 7:14 pm IST by ManaTeluguMovies

YSRCP Bus Yatra | జగన్ వస్తే జన జాతరే ..!! CM Jagan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement