ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రిపబ్లిక్ టీవీ ఉవాచ: జగన్ సన్నిహితుల ఆర్థిక అక్రమాలపై కేంద్రం గుస్సా.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితులైన కొందరు వైసీపీ ముఖ్య నేతల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టిందా.? ఆయా వ్యక్తులు నిర్వహిస్తోన్న సంస్థల ‘ఆర్థిక వ్యవహారాల్లో లొసుగుల్ని’ కేంద్రం గుర్తించిందా.? ఈ విషయమై కొందరు విదేశీయులు కేంద్రానికి ఫిర్యాదు చేశారా.? అసలేం జరుగుతోంది.?

బీజేపీ కనుసన్నల్లో నడిచే నేషనల్ మీడియా ఛానల్ ‘రిపబ్లిక్ టీవీ’ ప్రసారం చేసిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు తెలుగు నాట పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితులు.. వైసీపీ ముఖ్య నేతలు.. ప్రభుత్వంలో కీలక పదవుల్లో వున్నవారు..’ అంటూ నేషనల్ మీడియా ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడమే కాదు, ‘వైఎస్ జగన్‌కి సమస్యలు రాబోతున్నాయ్..’ అంటూ అనుమానాలు వ్యక్తం చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

వైఎస్ జగన్ చాలాకాలంగా అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. పలు కేసులు విచారణలో వున్నాయి కూడా. కొన్నాళ్ళు ఆయన జైల్లో వుండాల్సి వచ్చింది ఈ కేసుల నిమిత్తం. ‘రెండేళ్ళలో జగన్ సర్కార్ కూలిపోతుంది..’ అంటూ కొన్నాళ్ళ క్రితం బీజేపీకి చెందిన కొందరు నేతలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

2021లోనే ఆ రాజకీయ మార్పు చోటు చేసుకోబోతోందని అప్పట్లో ఆ బీజేపీ నేతలు జోస్యం చెప్పారు. అదే నిజమవుతుందా.? ఆ కారణంగానే కేంద్రం, రాష్ట్రానికి సంబంధించి ప్రతిసారీ నిర్లక్ష్యం వహిస్తున్నా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తాజా కేంద్ర బడ్జెట్ విషయంలో కావొచ్చు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కావొచ్చు.. ఇంకే విషయంలో అయినా కావొచ్చు.. కేంద్రాన్ని జగన్ నేరుగా నిలదీయలేకపోతుండడానికి కారణం తన మీద కేంద్రం పెట్టిన ప్రత్యేక దృష్టేనని విపక్షాలు విమర్శిస్తున్న విషయం విదితమే.

ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. అందునా మోడీ సర్కార్ జమానాలో.. ఏ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలాగైనా మారిపోవచ్చు. అంతా బాగానే వుందిగానీ, ఇంతవరకు ‘యెల్లో’ మీడియాకి ఈ వ్యవహారాలపై ఉప్పందలేదెందుకో.?

Exit mobile version