మూడు రాజధానులకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర వేయడం దురదృష్టకరమని తులసిరెడ్డి పేర్కొన్నారు. మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి, రాష్ట్రపతి ఆర్డర్ కు వ్యతిరేకమని తులసిరెడ్డి అన్నారు. ఏపీ సర్కారు దూకుడుకు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ కు పంపగా దానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారని అయితే, కోర్టు కొట్టివేసిందని తులసిరెడ్డి గుర్తు చేశారు. తాజాగా రాజధానుల ఆర్డినెన్స్ విషయంలో కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పారు. చట్టాలు కోర్టుల్లో నిలబడలేవని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎంకు తులసిరెడ్డి సవాల్ విసిరారు. 2014లో అసెంబ్లీ సాక్షిగా ఏపీ రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నానని చెప్పిన జగన్ ఇప్పుడు ఆ మాటను తుంగలో తొక్కినందున తన నిర్ణయానికి ప్రజల ఆమోదం తెలుసుకోవాలని సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. మూడు రాజధానుల అంశం మీదే ఎన్నికలకు వెళ్లాలని ఛాలెంజ్ చేశారు తులసిరెడ్డి.