చేసిన తప్పుకి చింతించాల్సిన దుస్థితి నెలకొన్నా.. ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్లో ‘అహం’ స్పష్టంగా కన్పిస్తోంది. ఇది సాదా సీదా తప్పిదం కాదు.. ‘నేరం’ కింద భావించాలేమో.! ఎందుకంటే, ప్రజాధనంతో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయించడమేంటి.? ఓ రాజకీయ పార్టీగా సిగ్గు పడాల్సింది పోయి.. చేసిన ‘చెత్త’ పనిని ఇంకా వైఎస్సార్సీపీ సమర్థించుకుంటోంది. ‘గతంలో తెలుగుదేశం పార్టీ చేసింది.. ఇప్పుడు మేం చేస్తున్నాం..’ అని నిస్సిగ్గుగా చెప్పుకుంటూ వచ్చారు వైసీపీ నేతలు.
టీడీపీ పాలన జనానికి నచ్చకనే, వైఎస్సార్సీపీకి పట్టంకట్టారన్న కనీస ‘ఇంగితం’ వైసీపీ నేతలు కోల్పోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.? ‘పార్టీ రంగులే వేయాలి..’ అని ఓ మంత్రిగారు హుకూం జారీ చేశారు అధికారులకి. ఇప్పుడా మంత్రిగారు తన పదవికి రాజీనామా చేస్తారా.? కోర్టు మొట్టికాయలు వేశాక కూడా ప్రభుత్వం బుకాయించే ప్రయత్నం చేసిందిగానీ.. పప్పులుడకలేదు.
మూడు వారాల్లో ఆయా భవనాలకు వేసిన వైసీపీ రంగుల్ని తొలగిస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. స్థానిక ఎన్నికల్లోపే ఈ వ్యవహారం ముగియాల్సి వుంది. కరోనా వైరస్ నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయబట్టి సరిపోయిందిగానీ.. లేకపోతే రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో వుండేదో ఏమో.!
స్థానిక ఎన్నికల కోసం పదో తరగతి పరీక్షల్ని సైతం వాయిదా వేసిన ఘనత వైఎస్ జగన్ సర్కార్ది. తప్పు మీద తప్పు.. మళ్ళీ మళ్ళీ తప్పు.. ఇలా తప్పులు చేసుకుంటూ, కోర్టులతో మొట్టికాయలేయించుకోవడం వైఎస్ జగన్ సర్కార్కి అలవాటైపోయిందనుకోండి.. ఇది వేరే విషయం. ఇప్పుడు వైసీపీ రంగుల్ని తొలగించి ఆయా ప్రభుత్వ భవనాలకు కొత్త రంగులు వేయాలంటే ఎంత ఖర్చవుతుందా.?
ఆ ఖర్చుని రాష్ట్ర ఖజానా నుంచి ఎందుకు ఖర్చు చేయాలి.? వైసీపీ పార్టీ ఫండ్ నుంచి దాన్ని ఖర్చు చేస్తే.. ఇంకోసారి ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా ఇలాంటి వికృత చర్యలకు పాల్పడకుండా వుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులే కాదు, ప్రభుత్వ పథకాలకు ఉపయోగిస్తునన వైసీపీ రంగులపైనా ‘వేటు’ పడే రోజు రావాలని ఆశిద్దాం.
ప్రభుత్వ పథకాలంటే అవి ప్రభుత్వ ఖజానా నుంచి మాత్రమే లబ్దిదారులకు చేరతాయి. కానీ, రాజకీయ పైత్యం పెరిగిపోయి.. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్.. ఇలా ప్రభుత్వ పథకాలకు రంగులేసుకోవడం మీద అధిక శ్రద్ధ పెడుతుండడం నైతిక విలువల్ని తుంగలో తొక్కడమే.