Advertisement

జనంపైకి రాళ్లు.. వైసీపీ నేతలకు రత్నాలు: చంద్రబాబు ఫైర్

Posted : June 11, 2020 at 11:00 pm IST by ManaTeluguMovies

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. గురువారం వైసీపీ పాలనపై ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. టీడీపీ హయాం కంటే వైసీపీ హయాంలో ఆదాయం పెరిగినా అభివృద్ధి లేదని, సంక్షేమాన్ని కుదించారని విమర్శించారు.

వైసీపీ పాలనలోని లోటుపాట్లను ఎత్తిచూపినా వాటిని చక్కదిద్దే చర్యలు చేపట్టకుండా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. వైసీపీ నేతల పాలనలో రాష్ట్రానికి వాటిల్లిన కీడు, ప్రజలకు కలిగిన చేటు ఎంతో చెప్పడానికే ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో చోటుచేసుకున్న పలు పరిణామాలను అందులో ప్రస్తావించారు. ప్రజా వేదిక కూల్చివేత దగ్గర నుంచి డాక్టర్లు సుధాకర్, అనితారాణిపై దాడుల వరకు అన్నింటినీ విపులంగా పేర్కొన్నారు.

నవరత్నాలు కూడా 90 శాతం మోసమేనని చంద్రబాబు విమర్శించారు. రాళ్లు జనంపైకి విసిరి, రత్నాలు వైసీపీ నేతలు కొల్లగొట్టారని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారుల్లో మూడింట రెండొంతుల మందికి ఆర్థిక సాయం ఎగ్గొట్టారని విమర్శలు చేశారు. బెదిరించి, ప్రలోభాలు పెట్టి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను లాక్కున్నారని ధ్వజమెత్తారు. ఎవరినైనా టీడీపీ నుంచి తీసుకుంటే తొలుత వారి చేత రాజీనామా చేస్తామన్న జగన్ ప్రకటన ఏమైందని ప్రశ్నించారు.

పొరపాటున ఫిరాయింపు జరిగితే అనర్హత వేస్తామన్నారని.. మరి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు ఎందుకు వేయలేదని నిలదీశారు. ఒక్క నాయకుడిని లొంగదీసుకుంటే వంద మందిని తయారుచేసే సత్తా టీడీపీకి ఉందని స్పష్టంచేశారు. ఏడాది కాలంలో దాదాపు 1600 కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

మొత్తానికి ఏడాది కాలంలో జరిగిన అన్ని విషయాలనూ చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పార్టీని వీడి వైసీపీలో చేరిన నేపథ్యంలోనే బాబు ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. వందల కోట్లు జరినామానాలు చెల్లించాలని బెదిరించి ఆయన్ను లొంగదీసుకున్నారని శిద్ధా పేరు ప్రస్తావించకుండా బాబు తన లేఖలో పేర్కొన్నారు. మరి బాబు లేఖ పార్టీ శ్రేణుల్లో ఎలాంటి ఉత్సాహం తెస్తుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

EC Orders Action Against TPD On Land Titling Act Propaganda | AP Elections

Posted : May 4, 2024 at 8:31 pm IST by ManaTeluguMovies

EC Orders Action Against TPD On Land Titling Act Propaganda | AP Elections

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement