కెరీర్ ఆరంభంలో విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా స్టైలిష్ డైరెక్టర్గా గుర్తింపు దక్కించుకున్న మెహర్ రమేష్ వరుసగా ఫ్లాప్లతో నిర్మాతలకు దారుణమైన నష్టాలు మిగిల్చాడు. ముఖ్యంగా శక్తి చిత్రంతో అశ్వినీదత్ ను పదేళ్ల పాటు కోలుకోకుండా చేశాడు. భారీ బడ్జెట్తో ఎన్టీఆర్ శక్తిని తెరకెక్కించిన దర్శకుడు మెహర్ రమేష్ అప్పటి నుండి కొత్త ఆఫర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎంతో మంది హీరోలకు ఈయన కథలు చెప్పాడు.
కొత్త వారితో, చిన్న వారితో సినిమాలు చేసేందుకు మనసు ఒప్పక పెద్ద హీరోలు ఛాన్స్ ఇవ్వక పోవడంతో కొన్ని పెద్ద సినిమాలకు ప్రీ ప్రొడక్షన్ వర్క్లో సాయంగా నిలుస్తున్నాడు. దర్శకుడిగా ఈయన మళ్లీ వస్తాడనే నమ్మకం ఎవరికి లేదు. కాని ఈయన తాజాగా మళ్లీ ఛాన్స్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన చిరంజీవిని కలిశాడట.
ఈమద్య కాలంలో కొత్త ట్యాలెంట్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో యూత్ డైరెక్టర్స్ కథలు వింటున్న చిరంజీవిని ఈ దర్శకుడు కూడా కలిసి కథ వినిపించాడని సమాచారం అందుతోంది. మెహర్ రమేష్ కథను విన్న చిరంజీవి త్వరలోనే నిర్ణయం చెబుతానంటూ తెలియజేశాడట. ప్రస్తుతం ఆచార్య చిత్రం చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత ఎవరి దర్శకత్వంలో చేస్తాడు అనే విషయంపై క్లారిటీ రాలేదు. మరి ఆ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఉంటుందేమో చూడాలి. చిరంజీవితో మెహర్ చేసి సక్సెస్ కొడితే ఆయన కెరీర్ మళ్లీ గాడిలో పడ్డట్లే. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి అలాంటి నిర్ణయాన్ని తీసుకోక పోవచ్చు అంటున్నారు.