Advertisement

దాసరి కోసం ఇండస్ట్రీ ఈ పని చేయాల్సిందే

Posted : June 27, 2020 at 6:04 pm IST by ManaTeluguMovies

ఊరందరి సమస్యలు పరిష్కరించే పెద్ద మనిషి పోతే.. అతడి ఇంటి తగవును తీర్చేవారు లేకపోయారట. అలా ఉంది ఇప్పుడు తెలుగు సినీ దిగ్గజం దాసరి నారాయణరావు కుటుంబ వ్యవహారం. దాసరి బతికుండగా ఇండస్ట్రీ సమస్యలన్నింటినీ ఎలా నెత్తిన వేసుకుని పరిష్కరించారో అందరికీ తెలిసిందే.

చిన్నా పెద్ద అని తేడా లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన పరిష్కరించారు. ఆయన మాట శాసనంగా ఉండేది. ఆయన చెబితే ఎవరైనా వెనక్కి తగ్గేవారు. సమస్యలు ఇట్టే పరిష్కారం అయిపోయేవి. కానీ ఆయన మరణానంతరం ఇండస్ట్రీ పెద్ద దిక్కు లేక ఎలా ఇబ్బంది పడిందో చూశాం. చిరు దాసరి స్థానంలోకి వచ్చినా.. దాసరిలా కమాండ్ చేయలేకపోతున్నారు. ఆ సంగతలా ఉంచితే.. దాసరి ఇంటి సమస్య బాగా ముదిరి ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది.

దాసరి పిల్లల మధ్య ఆస్తి గొడవలు పతాక స్థాయికి చేరుకున్నాయి. మధ్యలో కొంచెం సద్దుమణిగినట్లే కనిపించినా.. మళ్లీ అవి తీవ్ర రూపం దాల్చాయని తాజా పరిణామాల్ని బట్టి తెలుస్తోంది. దాసరి పెద్ద కొడుకు ప్రభు, చిన్న కొడుకు అరుణ్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభు స్వయంగా ఇండస్ట్రీ పెద్దల్ని అభ్యర్థిస్తున్నా వారు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.

తన ఆస్తి పంపకాల బాధ్యత చేపట్టాలని మోహన్ బాబు, మురళీ మోహన్ లాంటి వాళ్ల పేర్లు వీలునామాలో రాసి మరీ దాసరి వెళ్లిపోయారు. ఐతే ఇంతకుముందు మోహన్ బాబు తాను ఆస్తి పంపకాల బాధ్యత చూస్తానని మీడియా ముఖంగా చెప్పారు. ఆ ప్రయత్నం కూడా చేశారు.

ఐతే దాసరి కొడుకులు తన మాట వినకపోవడం, సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆయన పక్కకు తప్పుకున్నారు. మరికొందరు సినీ పెద్దలు జోక్యం చేసుకున్నా ఇదే పరిస్థితి. ఐతే ఇండస్ట్రీ సమస్యల విషయంలో ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా దాసరి ఇలా వెనక్కి తగ్గేవారు కాదు. కమాండ్ చేసేవారు. ఏదో ఒకటి తేల్చేవారు. అలా ఎన్నో సమస్యలు పరిష్కరించిన దాసరి కోసం ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు బాధ్యత తీసుకోవాల్సిందే.

దీని వల్ల వ్యక్తిగతంగా కొంచెం ఇబ్బంది వచ్చినా, మనకు ఎందుకొచ్చిన తలనొప్పి అనే భావన కలిగినా.. భరించాల్సిందే. దాసరి ఉంటే కొడుకులిలా కొట్టుకోవడం పట్ల ఎంత వేదన చెందేవారు. కాబట్టి పరిశ్రమకు దాసరి చేసిందంతా గుర్తుంచుకుని అయినా సినీ పెద్దలు ముందుకొచ్చి సమస్యను పరిష్కరించాల్సిందే.


Advertisement

Recent Random Post:

కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాను… కానీ మోసం చేసి వెళ్ళిపోయాడు: KCR | Telangana

Posted : April 29, 2024 at 2:27 pm IST by ManaTeluguMovies

కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాను… కానీ మోసం చేసి వెళ్ళిపోయాడు: KCR | Telangana

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement