అభివృద్ధిలో పులివెందులను మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉలిమెల చెరువు నుంచి పాడా పరిధిలో ప్రజలకు మంచినీరు అందించే ప్రణాళిలకు రూపొందించాలన్నారు. చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద తీర్చిదిద్ది.. మంచినీటి శుద్ధి ప్లాంట్ను కూడా అనుబంధంగా ఏర్పాటు చేయాలన్నారు. పులివెందుల మెయిన్ రోడ్ మార్పు చేయాలని అధికారులకు సూచించారు.
‘పాడా’ని నాలుగు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు ఈ సందర్భంగా వివరించారు. పట్టణంలో మంచి నీరు, డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి ప్లాంట్ తదితర సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 2053 వరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికను రూపొందించామని అధికారులు వెల్లడించారు. పాడా పరిధిలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నమూనాలను సీఎంకు వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వసతులను ఆధునీకరిస్తున్నామని సీఎంతో చెప్పారు.
వీధి వ్యాపారుల కోసం కొత్త ప్రణాళికలు రూపొందించామని.. దీంతో వారు రెండు మూడు చోట్ల వ్యపారం చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం పాడా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమీక్షలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.