గత నెల రోజులుగా సోషల్ మీడియాలో సోనూ సూద్ పేరు ఒక రేంజ్ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ ఆయన్ను దేశ వ్యాప్తంగా ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇటీవల మహిళ కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లాలి అంటే ఏకంగా విమానంను ఏర్పాటు చేయించి వారిని వారి స్వస్థలంకు పంపించాడు. ఎంతో మంది వలస కార్మికులను బస్సులు ఏర్పాటు చేసి మరీ వారి స్వస్థలాలకు పంపించాడు.
కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సోనూ సూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ సమయంలోనే సోనూ సూద్ గురించి నెట్టింట్లో అనేక కామెంట్స్ మీమ్స్ వచ్చాయి. వాటన్నింటిని కూడా ఆయన చాలా ఫన్నీగా సరదాగా తీసుకున్నాడు. తాజాగా సుష్రిమ ఆచార్య అనే మహిళ ఒక సరదా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్కు సోనూ సూద్ ఇచ్చిన సమాధానం అందరిని ఆకట్టుకుంది.
లాక్ డౌన్ కారణంగా నా భర్త నేను ఎప్పుడు కలిసే ఉంటున్నాం. అది చాలా ఇబ్బందిగా ఉంది. నన్ను మా అమ్మ వాళ్ల ఇంట్లో లేదంటే ఆయన్ను వాళ్ల అమ్మవాళ్ల ఇంట్లో వదిలేయండి అంటూ సోనూ సూద్కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. ఆ ట్వీట్ కు సమాధానంగా ఇద్దరిని గోవా పంపిస్తా బెటర్గా ఉంటుంది అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. గోవా పంపిస్తా ఏమంటారు అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. సోనూసూద్ సమయస్ఫూర్తిని అంతా అభినందిస్తున్నారు.