విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైటర్ లేదా లైగర్ అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఈ లాక్ డౌన్ లేకుండా ఉండి ఉంటే ఈ ఏడాది దసరా వరకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఎప్పుడు వచ్చేది చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ తదుపరి 12వ సినిమాలో కీలక మార్పులు జరిగాయి.
చాలా నెలల క్రితం విజయ్ దేవరకొండ 12వ చిత్రం శివ నిర్వాన దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దిల్ రాజు చాలా ఇంట్రెస్ట్ తో విజయ్ దేవరకొండ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. అయితే అంతకు ముందే మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ లో ఒక సినిమాను చేసేందుకు విజయ్ దేవరకొండ కమిట్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో కంటే ముందే మైత్రి మూవీస్ వారితో సినిమా చేయాలని రౌడీ స్టార్ భావించాడట.
మైత్రి మూవీస్ వారికి విజయ్ దేవరకొండ 12వ చిత్రాన్ని దిల్ రాజు వదిలేశాడట. దర్శకుడు శివ నిర్వాననే దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు కాని దిల్రాజు స్థానంలో నిర్మాతుగా మైత్రి వారు ఉండబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాదిలో ఆరంభం అయ్యే అవకాశం ఉంది.
ఈ చిత్రం తర్వాత అయినా లేదంటే ఆ తర్వాత ఎప్పుడైనా దిల్రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండ మూవీ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అయితే దిల్రాజు కావాలని తెలివిగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించుకున్నాడని కొందరు అంటున్నారు. ఆయన ఆర్థికంగా ప్రస్తుతం కాస్త దెబ్బ తిని ఉన్నాడు. లాక్డౌన్ ఎఫెక్ట్ ఆయనపై చాలా ఉంది. అందుకే విజయ్ 12వ చిత్రాన్ని వదిలేసినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.